Wednesday, July 15, 2020

శని త్రయోదశి - Shani Trayodashi

శని త్రయోదశి

శని త్రయోదశి :

చంద్రమానం ప్రకారం పక్షము (15) రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. నెలకు రెండు త్రయోదశులు వస్తాయి అనగా సంత్సరానికి 12 త్రయోదశిలు. ఇందులో ఏ త్రయోదశి అయితే శనివారముతో కూడుకొని వస్తుందో ఆ రోజునే “శని త్రయోదశి” అంటారు. జూలై 18, 2020 నాడు శని త్రయోదశి వస్తుంది, కావున దానిని వినియోగించుకోగలరు .

మన పూజా విషయాన్ని అనుసరించి, ప్రతీ దైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒక వారాన్ని, ఒక హోరా కాలన్ని, కొన్ని ప్రీతికర వస్తువులని మన పెద్దలు నిర్ణయించినారు. ఆయా సమయాలలో ఆయా గ్రహాలకి పూజ చేసినా, దాని ప్రకారం దాన, ధర్మాలు, జప & తపాలు చేసినా ఆయా దేవతల అనుగ్రహానికి పాత్రత కలుగుతుంది.

అదే విధంగా శనైశ్చరునికి (శని దేవుడి) త్రయోదశి తిథి, శని హోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి. మాములుగా శనివారంనాడు శని హోర ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 మధ్యలో ఉంటుంది. ఐతే శనిత్రయోదశి నాడు రోజంతా పుణ్యకాలమే. ముఖ్యంగా ప్రదోష సమయమైతే మరీ మంచిది.

ఆవిధంగా శని త్రయోదశి అంటే శనైశ్చరునికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనైశ్చరుడు.

కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతీ కర్మకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు.

నవ గ్రహాల్లో ఏడో వాడైన శనైశ్చరుడు మంద గమనుడు అని (మెళ్ళగా  నడిచేవాడు) అని పురాణోక్తి అలాంటి అయన పేరు చెప్తేనే ఎవరైనా భయపడతారు, కాని ఆయన ఎంతో నెమ్మదిగా అమ్మ నాన్నల లాంటి ప్రేమను చూపిస్తాడు. అయన ఎళ్ల వేళలా నీతి, న్యాయం, ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు.

గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు జరగకుండా కాపాడుతాడు.

ఆయనను భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగినవారిని శనైశ్చరుడు చల్లగా చూస్తాడు.

కాని సకల జీవరాశులను సన్మార్గంలో నడిపించేందుకు, వారి వారి కర్మలకు తగిన ఫలాన్ని అందిచడానికే ఆయన తాపత్రయం. అంతే కాకుండా ఆయనను నమ్ముకున్న వారికి, ఆయనకు ఇష్టం అయిన శని త్రయోదశి నాడు భక్తితో కొలిచిన వారికి శుభాలనొసగుతాడు. ఆ రోజు ఆయనకు పూజ చేసిన వారికి ఏలినాటి శని దశ అంతగా బాధించదని పురాణాలూ చెబుతున్నాయి.

శని త్రయోదశి రోజున శనైశ్చరునికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆయనకి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శనైశ్చరుడు ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శని పీడా ఫలితాలు :

డబ్బు దుబారా, అపనింద, నపుంసకత్వం, మాట విలువ తగ్గటం, జీర్ణ సంబంధ రోగాలు, వెన్నునొప్పి, పొట్టరావడం, కొవ్వు, బద్దకం, అలసట, అతి నిద్ర, పైవారి ఒత్తిడి, నీచ స్త్రీ పురుషులతో సాంగత్యం, వ్యసనాలకు  అలవాటు పడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకక పోవటం, అందం తగ్గటం మరియు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య , కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు  వంటివి ముఖ్యంగా జరుగుతాయి.

|| శనైశ్చరుని మంత్రాలు ||

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం |
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ||

(అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనైశ్చరా! నీకు నమస్కారము.)

|| ఓం శం శనయేనమ:||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్చరాయై నమః ||

|| కోణస్ధః పింగళో బభ్రుః కృశాణో రౌద్రాంతకో యమః శౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుతః ||

శని గాయత్రీ మంత్రం :

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో శౌరి ప్రచోదయాత్ ||

|| ఓం కాకధ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ||

|| ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నోః మందః ప్రచోదయాత్ ||

ఏలిననాటి శని గ్రహ దోష శాంతికి చేయవలసినవి :

1.      ఉదయాన్నే లేచి, నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.

2.      ప్రతి రోజు శని జపం చేయాలి.

3.      శనికి తిలాభిషేకం (నువ్వులు, నువ్వుల నూనె) చేయించాలి.

4.      వీలైన వారు తామే స్వయంగా అభిషేకం లేదా శివార్చన చేస్తే మంచిది.
ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా
ఎనిమిది సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట.

5.      శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట.

6.      హనుమంతుని పూజ లేదా సుందరకాండ పారాయణ లేదా నల చరిత్ర చదవటం.

7.      జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. అత్త మామలను, వంట చేసి వడ్డించిన వారిని, మన మేలు కోరేవారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను, భవ బంధాలను మరువరాదు.

8.      ఆ రోజు మద్య, మాంసాలు ముట్టరాదు.

9.      వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. ఎవరితోను వాదనలకు దిగరాదు.

10.  ప్రతి రోజు నువ్వుండలు కాకులకు పెట్టుట.

11.  శనివారం రోజు రొట్టిపై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. ఆరోజు ఆకలితో ఉన్న వారికి, పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.

12.  అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. (* అపాత్ర దానం పనికిరాదని మన పెద్దలు చెప్పిన విషయం – దానాలు అనేవి అవసరం ఉన్న నిరుపేదలకు, పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. అవసరం లేనివారికి చేస్తే ఫలితంరాదు సరి కదా పాపం చేరే అవకాశాలు ఎక్కువ.)

13.  కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్లనువ్వులు, మేకు కలపటం.

14.  బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట

15.  ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట.

16.  ప్రతి శనివారం రావిచెట్టుకు ప్రదక్షణం మరియు నల్ల నువ్వులు, మినుములు కలిపిన నీటిని రావి చెట్టుకు పోయటం.

17.  ఇనుముతో చేసిన ఉంగరం, చేపలు పట్టే పడవ ముందుభాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించుట.

18.  బ్రాహ్మణునికి నల్లవంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లని దుప్పటి దానం చేయటం.

19.  ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చగాళ్ళకు ఆహరం పెట్టుట
నల్లని దుప్పటి దానం చేయటం.

20.  అయ్యప్ప మాల ధరించుట, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట, శ్రీ వెంకటేశ్వరస్వామి మాల ధరించుట

21.  ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయంలో శివుని దర్శనం, హనుమంతుని దర్సనం శని గ్రహ దోషం శాంతించును.

ఈ విధం గా శనైశ్చరుని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషాలు, దారిద్ర్యం తొలగించి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. అంతే కాకుండా, తప్పక శనైశ్చరుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.

శని మహత్యం :

శనైశ్చరుడు సూర్యభగవానునికి, ఛాయాదేవికి కలిగిన సంతానంగా శాస్త్రాలు చెబుతున్నాయి. శనైశ్చరుడి సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవులు. ఆయనకి ఉన్న ఇతర పేర్లు కోణస్త, పింగళ, కృషాణు, శౌరి, బభ్రు, మంద, పిప్పలా, రౌద్రాంతక, సూర్యపుత్ర.

శనైశ్చరుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శనైశ్చరుడు కోపోద్రిక్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనైశ్చరుని కించపరిచే విధంగా మాట్లాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనైశ్చరుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనైశ్చరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు.

శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి.

శనిమహాత్మ్యం, కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

No comments:

Post a Comment

Quotation of the Day

Quotation of the Day https://youtube.com/shorts/v6hJRSc7MM4?si=19029rdHhVOFzhhY